నగదు, బంగారం, వెండి వస్తువుల
స్వాధీనం
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధి కొలనారలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి నగదు, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్డీపీవో చౌరహరి సాహు మంగళవారం చందిలి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొలనార సమితి కార్యాలయంలో బ్లాక్ ప్రొగ్రామింగ్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్న కొట హేమలత ఈ నెల ఎనిమిదో తేదీన రాయగడకు వెళ్లేముందకు తన ప్రభుత్వ నివాసానికి తాళం వేసి వెళ్లారు. మరొసటి రొజు ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు, అల్మరా తెరిచి ఉండటాన్ని గమనించారు. దొంగతనం జరిగినట్లుగా భావించి చందిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన దుండగులు బంగారు గొలుసు, ఒక జత బంగారు చెవిపోగులు, రెండు బంగారు ఉంగరాలు, వెండి గ్లాసు, వెండి గిన్నె, వెండి చెంచాతొ పాటు 86 వేల రూపాయల నగదును చోరీ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సైంటిఫిక్ బృందం సేకరించిన ఆధారాలను అలాగే స్థానికుల సమాచారం ఆధారంగా విచారణ కొనసాగించిన పోలీసులు శ్రీనివాస్నగర్కు చెందిన పర్మి శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి బంగారం, వెండి గ్లాస్, వెండి గిన్నె, 30 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడి గురించి పోలీసులు గాలిస్తున్నారు.


