శ్రీకాకుళం రూరల్: విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, వరదలు, నదులు పొంగేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ఎలా రక్షించాలి అన్న శిక్షణలో సిక్కోలు విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. ఉత్తరాంధ్ర నుంచి 14వ ఆంధ్రా బెటాలియన్ తరఫున గురజాడ విద్యాసంస్థలు గాయత్రీ కళాశాలలో బీఎస్సీ సెకెండియర్ చదువుతున్న సార్జంట్ బుంగ నాని ఈ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. శ్రీకాకుళం మండలం మునసబుపేటకు చెందిన నాని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. గడిచిన నెలలో జరిగిన ఎంపికల్లో ఉత్తరాంధ్ర నుంచి స్పెషల్ అడ్వంచర్ క్యాంప్నకు గాను శ్రీకాకుళం జిల్లా నుంచి నాని మాత్రమే ఎంపిక కావడం గమనార్హం. అస్సోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాంట్రింగ్న్ అండ్ అడ్వంచర్లో 12 రోజుల పా టు ఈ విద్యార్థి శిక్షణ పొందాడు. పర్వతారోహణ, రివర్ క్రాసింగ్ చేయడం, తాళ్లతో కట్టుకొని బ్రిడ్జిలు దాటడం వంటివి వాటిలో మెలకువలు నేర్పించా రు. ప్రతికూలమైన అటవీ ప్రాంతంలోనూ, కొండల్లోనూ టెంట్లు వేసుకొని ఎలా నివసించాలి, సర్వైవల్ టెక్నికల్ ద్వారా ఎలా బయట పడాలి వంటివి నేర్పిస్తారు. విద్యార్థి ప్రతిభపై గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యన్నారాయణ, ఎన్సీసీ క్యాడెట్ ప్రత్యేకాధికారి వంగా మహేష్ అభినందనలు తెలిపారు.


