జయపురం: బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిని సబ్ డివిజన్ హాస్పిటల్గా గుర్తించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని బొయిపరిగుడ సురక్షా మంచ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావో ప్రభావిత ప్రాంతమైన బొయిపరిగుడ సమితిలో 10 పంచాయతీలతో పాటు సమితి సరిహద్దున కుంధ్ర సమితిలో మరో 5 పంచాయతీల ప్రజలకు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రే ఆధారమని చెప్పారు. పలు కారణాల వల్ల ఉచిత వైద్య సేవలు అందడం లేదన్నారు. డాక్టర్లు, నర్సుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. బొయిపరిగుడ మీదుగా విజయవాడ– రాంచీ 326 జాతీయ కారిడార్ ఉండటం వల్ల ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులంతా బొయిపరిగుడ ఆస్పత్రికి వస్తున్నా సరైనా వైద్యసేవలు అందడం లేదన్నారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


