రాయగడ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాయగడ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం మే 30వ తేదీ నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు సహాయ ఎన్నికల నమోదు అధికారుల వద్ద నుంచి గణన ఫారాలను స్వీకరించి ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి చెప్పారు. ఈ మేరకు శనివారం సమితి సమావేశం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతీ అర్హుడైన ఓటరు, ఓటరు జాబితాలొ నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలిగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు వివరించారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే బీఎల్వోలు నిర్ణీత గడువులోగా ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా బూత్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీఆర్పీలు, ఎంబీకేలు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన, మహిళా సంఘాలు, గ్రామీణ యువత బీఎల్వోలకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
వాహనాల తనిఖీ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, రాయఘడ, కాశీనగర్, గుసాని, ఆర్.ఉదయగిరి, మోహానా తదతర ప్రాంతాల పోలీసు ష్టేషన్ల పరిధిలో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. గజపతి జిల్లా నుంచి అక్రమంగా గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ అరికట్టడానికి ఈ చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను కూడా పట్టుకుని కౌన్సెలింగ్ చేసి విడిచి పెట్టారు.


