● ఎన్నికల్లో వరించిన విజయం
రాయగడ: లారీ యజమానుల సంఘానికి శనివారం జరిగిన ఎన్నికల్లో యాళ్ల కొండబాబు అధ్యక్షునిగా ఘనవిజయం సాధించారు. స్థానిక కపిలాస్ కూడలి వద్ద గల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారులుగా ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, నీలా బిసోయి, సుశాంత్ పండాలు వ్యవహరించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై యాళ్ల కొండబాబు, బి.మన్మథరావులు బరిలో ఉన్నారు. పోటాపోటీగా కొనసాగిన ఎన్నికల్లో మొత్తం 361 మంది ఓటర్లు ఉండగా ఇందులొ 328 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా గెలుపొందిన కొండబాబుకు 170 ఓట్లు అనుకూలంగా పోలవ్వగా ప్రత్యర్ధి బి.మన్మథరావుకు 148 ఓట్లు దక్కాయి. దీంతొ కొండబాబు తన సమీప అభ్యర్థిపై 22 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే సాధారణ కార్యదర్శిగా జి.రామ్మోహన్రావు, ఉపాధ్యక్షునిగా బి.రమేష్, సహకార్యదర్శిగా పి.మహానందియా, కోశాధికారిగా పికే సామల్లు విజయం సాఽధించారు. అధ్యక్షునిగా విజయం సాధించిన కొండబాబబుకు ఆయన మద్దతుదారులు అభినందించారు. అలాగే ఎస్డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈసందర్బంగా కొండబాబు మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలదో సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్డీపీవో గౌరహరి సాహు, చందిలి ఐఐసీ, గుణుపూర్ ఐఐసీ కేకేబీకే కుహరో, రాయగడ ఐఐసీ ప్రశన్నకుమార్ బెహరలు పర్యవేక్షించారు.


