రాయగడ: ఈనెల 30వ తేదీన స్థానిక కొరాపుట్ కూడలిలోని యూనియన్ కార్యాలయం ప్రాంగణంలో జరగనున్న రాయగడ ట్రక్ యజమానుల సంఘం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆ యూనియన్ల మాజీ అధ్యక్షులు యాళ్ల వెంకటేశ్వరరావు (కొండబాబు), బి.మన్మథరావు (చిట్టి)లు బరిరో ఉండగా.. అదే పదవి కోసం ఎం.శ్రీనివాస్రావు, సోమేశ్వర్ పాత్రోలు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో అధ్యక్ష పదవికి నలుగురు పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి బి.శంకరరావు, కోట సూరిబాబు, బి.రమేష్, ముచ్చి శ్రీనివాస్రావు, ఎస్.రమణలు పోటీ పడుతుండగా, సాధారణ కార్యదర్శి పదవికి ఎస్.శంకరావు దొర, ప్రశాంత కుమార్ బిసొయి, వీజీవీ ప్రసాద్, రామ్ మోహన్ గోపాల శెఠి, కె.జానకిరావు, సహ కార్యదర్శి పదవికి టి.ప్రశాంత్, పానిక్రావు మహానందియా, రెడ్డి సత్యనారాయణ, ఎల్.రాజేశ్వరి, కోశాధికారి పదవికి ప్రశాంత్ కుమార్ సామల్, పి.రవి, ఏఆర్ జగన్నాథంలు బరిలో ఉన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారిగా వ్యవహరించే రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజసుందర్ నాయక్, న్యాయవాదులు సుశాంత్ పండ, నీల బిసొయ్లకు సమర్పించారు.


