రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో భారీ ఎత్తున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు శుభద్ర గ్రామంలో నివసిస్తున్న పెద్దిన రామారావు ఇంటిలో చొరబడి కిలో వెండి ఆభరణాలు, బంగారు నగలను దోచుకున్నారు. బాధితుడు ఈ మేరకు గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రామారావు అతని బంధువుల ఇంటికి వారం క్రితం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటిలో చొరబడి దొంగతనానికి పాల్బడ్డారు. బుధవారం రామారావు పెద్ద కొడుకు ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో తలుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించాడు. లోపలకు వెళ్లి చూడగా అలమరను విరిచిన దుండగులు అందులో గల నాలుగు తులాల బంగారు హారం, రెండు చెవి దిద్దులు, కిలో వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదు పోయినట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేయడంతో వెంటనే వచ్చి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


