రాయగడ: ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. మరోవైపు డీజిల్ ,పెట్రోల్ ధరలు పెంచడంపై బీజేడీ నిరసన తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జిల్లాలోని పద్మపూర్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.
పద్మపూర్లో గల ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. డబల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యాలపై నాయకులు దుయ్యబట్టారు. ఇంధన ధరలను కుత్రిమ కొరత చూపించి ధరలు పెంచడం సామాన్య మానవునిపై గుది బండగా మారిందని నినాదాలు చేశారు. పెట్రోల్ ఉత్పత్తులపై ధరలు నియంత్రించకపోతే రానున్నకాలంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో గునుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగొ, బీజేడీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పింకు పండా, ప్రశాంత్ దొళాయ్, మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


