రాయగడ: స్థానిక పయికొ వీధిలో పూజలందుకుంటున్న మా సమలాయి దుర్గమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. మంళవారం రాత్రి సంప్రదాయబద్ధంగా మల్లెలు (నిప్పులపై నడక) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజా రి బలముండతో పాటు అయిదు రోజుల పాటుగా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసే పేరంటాలు కూడా ఈ మల్లెల తొక్కే కార్యక్రమంలొ పాల్గొన్నారు. బుధవారం ఉదయం మందిరం నుంచి ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్థానిక మజ్జిగౌరి అమ్మవారి మందిరం ప్రాంగణంలో గల అమ్మవారి పాదాల గుడి వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించి, అనంతరం అక్కడ నిమజ్జనం చేశారు. దీంతో ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆమ్మవారికి మొక్కుబడులను తీర్చుకున్నారు. నిమజ్జనోత్సవంలో కాళీరూపంతో విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.


