జయపురం: నవరంగపూర్ జిల్లా చందాహండి గౌఢ జాతి ప్రజలపై భజరంగ్ గూండాలు అమానుషంగా దాడి జరిపారని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరోపించారు. దాడిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్య నిర్వాహక సభ్యులు, ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి నాయకత్వంలో పలువురు నేతలు, కార్యకర్తలో చందాహండి సంఘటనను ఖండిస్తూ స్థానిక ప్రధాన కూడలి వద్ద బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితిలో గౌడ జాతికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ సొంత ఆవులను రోడ్డుపై తీసుకువెళ్తుండగా భజరంగ్దళ్ గూండాలు వారిపై అమానుషంగా దాడి జరిపి కొట్టారని ఆరోపించారు. ఆ దుండగులను హిందూ ధర్మ రక్షకులుగా ఎవరూ నియమించలేదని, వారు హిందూ ధర్మ కంట్రాక్టర్లు కాదని వెల్లడించారు. ఆ సమయంలో బాధితులు నోరు విప్ప లేకపోయారని మహంతి తెలిపారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో, నేతలు భీష్మ నాయక్, నంద హరిజన, భాస్కర మిశ్ర, తదితరులు పాల్గున్నారు.


