● ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
జయపురం: నాటక రంగాన్ని రక్షి్ంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహణీపతి అన్నారు. స్థానిక గీతా భవనంలో ప్రియ థియేటర్ గ్రూపు నిర్వహించిన వారం దినాల నాటక శిక్షణ శిబిరం సోమవారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా అమెబి సికిబి కార్యక్రమంలో మేము కూడా నేర్చుకుంటాం నాటక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ప్రియ ఽథియేటర్ గ్రూపు అధ్యక్షులు దిలీప్ మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. మన ప్రాచీన కళాసంపదలో నాటక కళ అతి ముఖ్యమైనది అన్నారు. నాటకాలు సమాజ ప్రతిబింబాలని.. వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.
వారం రోజులు ప్రియ థియేటర్ గ్రూపువారు పిల్లలకు ఇచ్చిన నాటక శిక్షణ కొనియాడదగ్గదని అన్నారు. కొద్ది దినాలలో శిక్షణ పొందిన చిన్నారులు ప్రతిభావంతంగా నాటకాలు ప్రదర్శించి తమ పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా నాటక శిక్షకులు గురు అశోక్ కర్, సమీర్ మహాపాత్రో, అమరేంధ్రహత్త, మానస ఆచార్య, పంచానన మిశ్ర, పద్మచరణ చౌధురి, నిరంజన్ పాణిగ్రహిలను ఘనంగా సన్మానించారు. శిక్షణ పొందిన 32 మంది బాలకళాకారులకు ముఖ్యఅతిథి తారాప్రసాద్ బాహిణీపతి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. శిక్షణ శిబిరంలో బాలనటులు నేర్చుకున్న మూడు నాటకాలను ప్రదర్శించారు. మొదట సమీర్ మహాపాత్రో రచించిన ‘బప్పంకు స్వప్న’(తండ్రి కల), అనంతరం నిరంజన్ పాణిగ్రహి రచించిన ‘పిక్నిక్’, తరువాత అశోక్ కర రచించిన ‘హే హో హు హూ’కళాకారులను ప్రదర్శించారు. పిల్లలు ప్రదర్శించిన నాటకాలు తిలకించిన ప్రేక్షకులు నటనలో పిల్లలు చూపిన ప్రతిభను ప్రశంసించారు.


