పర్లాకిమిడి: కేంద్ర గిరిజనాభివృద్ధిశాఖ మాజీ మంత్రి, గజపతి జిల్లా బీజేపీ పర్యవేక్షకులు విశ్వేశ్వరతుడు సోమవారం సోండివీధి వద్ద సరస్వతీ శిశు మందిర్ విద్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు మహాంత రామానంద దాస్ ఘనంగా స్వాగతం పలికారు. మహారాజా క్రిష్ణచంద్రగజపతి 53వ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తైలవర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రత్యేక ఒడిశా రాష్ట్రం ఏర్పాటుకు, పర్లాకిమిడిలో అనేక విద్యాసంస్థలు నెలకోల్పిన గజపతి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతీ శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని విశ్వేశ్వర తుడుకు అందజేశారు. అనంతరం విద్యాలయం భవనాన్ని చూసి ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో విద్యాలయం పర్యవేక్షక కమిటీ అధ్యక్షులు సుభాష్ చంద్ర జమాదార్, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా, అనాది పాణిగ్రాహి ఉన్నారు.


