భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం అంగుల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్కర్స్ కాంగ్రెస్ 16వ కొత్త శాఖ కార్యాలయ భవనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) డి.సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రామిక్ కాంగ్రెసు ప్రతిపాదించిన పలు కార్మిక సంక్షేమ, మౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాల్ని పరిశీలించిన మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఆర్ఎం తెలిపారు. సునీల్ కుమార్ భొంజొ సమన్వయంతో నిర్వహించిన ప్రారంభోత్సవ సభకు శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు హాజరయ్యారు. అంగుల్ రైల్వే కాలనీలో ఉద్యోగులకు వసతి సదుపాయం, అంగుల్ మున్సిపాలిటీ నీటి సరఫరా పైప్లైను అనుసంధానంతో రెల్వే కాలనీలో పరిశుద్ధ తాగునీటి సరఫరా, అంగుల్ స్టేషన్ నుంచి లోకో షెడ్ వరకు ఫుట్ ఓవరు బ్రిడ్జి, లోకో షెడ్ ఉద్యోగులకు ఓవర్టైమ్ భృతి, ఖాళీ పోస్టుల భర్తీ వంటి ప్రాథమిక డిమాండ్లను డీఆర్ఎంకు సభాముఖంగా ప్రతిపాదించినట్లు మీడియా సెల్ ప్రతినిధి లక్ష్మీధర మహంతి తెలిపారు.


