భువనేశ్వర్: సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షను ఎత్తిచూపుతున్న తాజాగా దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. కటక్ జిల్లా పసులుండ గ్రామంలో కవల ఆడపిల్లలను ప్రసవించిన బా లింత పట్ల మెట్టినింటి వేధింపులు కలకలం రేపా యి. మగ బిడ్డని ఆశించిన స్థానంలో కవల ఆడపిల్లల్ని ప్రసవించడంతో కొడుకు కోడలుపై మెట్టినింటి సభ్యులు హింసాత్మక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి మహంగా పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. బాధితులను చంద్రశేఖర్ జెనా, అతని భార్య పార్వతి జెనాగా గుర్తించారు. కుటుంబ సభ్యులు మగబిడ్డ పుడతాడని ఆశించారు. వారికి కవల కుమార్తెలు పుట్టిన తర్వాత మహిళ అత్తింటి కుటుంబ సభ్యులు ఈ దంపతులపై శారీరకంగా దాడి చేశారని ఆరోపించారు. సుమారు నెల క్రితం పార్వతి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం తర్వాత అత్తమామలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకు పుట్టలేదని ఆ దంపతులను పదేపదే నిందిస్తూ కించపరిచారు. క్రమంగా ఈ చర్య హింసాత్మకంగా మారడంతో విషయం గడప దాటింది. ఆడ పిల్లల ప్రసవం విషయంపై కుటుంబ సభ్యులు తమను దారుణంగా కొట్టారని ఆ జంట ఆరోపించడంతో పరిస్థితి హింసకు దారి తీసినట్లు సమాచారం. ఈ విషయమై మహంగా పోలీస్ ఠాణాలో అధికారిక ఫిర్యాదు నమోదైంది. దాడి తర్వాత చంద్రశేఖర్ మరియు పార్వతి ప్రస్తుతం తమ నవజాత కవల కుమార్తెలతో కలిసి ఆ మహిళ పుట్టింటిలో ఉంటున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, ఆరోపణలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన సమాజంలోని కొన్ని వర్గాలలో పాతుకుపోయిన సామాజిక వివక్ష, మగపిల్లల పట్ల కొనసాగుతున్న ప్రాధాన్యతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.


