రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో శనివారం మేధో సంపత్తి (ఇన్టీల్యాక్చువల్ ప్రొపర్టీ రైట్స్) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యూఢిల్లీలోని సీ.డాట్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ గుప్తేశ్వర్ మాఝి హాజరై మాట్లాడారు. ఉత్పత్తి వాణిజ్యకరణ, మేథో సంపత్తి హక్కుల పాత్ర గురించి వివరించారు. ఒడిశా జీఐ కన్సల్టెంట్ డాక్టర్ అనిత స్వాత్ గౌరవ అతిథిగా హాజరై వివిధ ప్రాంతీయ కళాకారులు జీఐని ఎలా పొందవచ్చొ వివరించారు. మరో అతిథి పూణేకు చెందిన జెనియోబ్రయిన్ ఐటీ సోల్యూషన్ వ్యవస్థాపకురాలు, ఆ సంస్థ సీఈవో ఆశా మోళే మాట్లాడుతూ.. మేథో సంపత్తిని ఎలా నమోదు చేసుకుని దాని ఆవశ్యకత గురించి వివరించారు. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ, కంప్యూటర్ సైన్స్ విభాగం డిప్యూటీ డీన్ డాక్టర్ కె.మురళిగోపాల్ తదితరులు ప్రసంగించారు. జిల్లాలోని చాటికొనాలోని డీకేడీఏ ప్రత్యేకాధికారి జొగబంధు మెహర్ పాల్గొని డొంగిరియా కొంధొ తెగకు చెందిన ఆదివాసీలు స్వయం ఉపాధి మార్గాలతో పాటు వారు తయారు చేస్తున్న సాల్ను గురించి వివరించారు. వీరు తయారు చేస్తున్న సాల్కు జీఐ ట్యాగ్ లభించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో పుటాసింగ్ ప్రాంతానికి చెందిన లంజియా సవర తెగకు చెందిన ఆదివాసీలు చిత్రలేఖనం ఇడితాల్ పెయింటింగ్లను ప్రదర్శనలో ఉంచారు.


