ప్రత్యేక పూజల్లో భక్తజనం
నేటితో ముగియనున్న ఉత్సవం
రాయగడ: చల్లని తల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవాలు ఉత్సాహంగా కొసాగుతున్నాయి. మార్చి 29వ తేదీన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరున్న మజ్జిగౌరీ అమ్మవారికి ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రసాదాలను పంపిణీ చేస్తుండగా మరికొందరు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కనిపించింది. ఇదిలాఉండగా అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి సిందూరం, తాయెత్తులు విక్రయాలకు గిరాకీ పెరిగింది. ఎటువంటి దుష్టశక్తులు బారిన పడకుండా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజారులు తయారు చేసే తాయత్తులను ఖరీదు చేసుకున్న భక్తులు వాటిని చేతికి కట్టుకుంటారు. అదే చిన్నపిల్లలకు మెడలో కడతారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు వీటిని ప్రగాఢంగా నమ్ముతారు. తాయత్తలు కట్టుకోవడంతో పాటు అమ్మవారి సిందూరాన్ని తమతో తీసుకెళ్తున్నారు.
నేడు పూర్ణాహుతి
అమ్మవారి చైత్రోత్సవాల్లో ప్రధాన ఘట్టం చండీహోమం. చండీ హోమం పూర్ణాహుతి గురువారం రాత్రితో ముగుస్తుంది. దీంతో ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తారు చండీ హోమంలో భక్తులు కొబ్బరికాయ, నెయ్యి తదితరమైనవి సమర్పించుకుంటారు. హోమంలో (పూర్ణాహుతి)లో వీటిని వేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తులు భావిస్తారు. అలాగే ముగింపు ఉత్సవాల్లో భాగంగా మల్లెలు తొక్కడం, ఎర్రని నిప్పులపై నడవడంతో ఉత్సవాలు ముగుస్తాయి.


