న్యూస్రీల్
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వక్తులు
మహనీయుల విగ్రహాలకు ఘనంగా
నివాళులు
నాయకుల వేషధారణలో అలరించిన చిన్నారులు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సంక్షేమ ఫలాలు..
రాయగడ:
సంక్షేమ ఫలాలు అందరికీ చేరువ కావాలని వక్తలు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు అధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయగడ జిల్లా వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. పట్టణంలోని వివిధ కూడళ్లలోని మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక గాంధీపార్క్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు నవీన్ చంద్ర నాయక్, నిహారి రంజన్ కుహరో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక బిజూ పట్నాయక్ అడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు వేదికపై బహుమతులను అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా గోపబంధుదాస్, మధుసూదన్ దాస్ తదితర మహానీయులు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. రాష్ట్ర మాజీమంత్రి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాధ సరక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్నాన గౌరీశంకర్ రావు, అనసూయా మాఝి తదితరులు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడిః: ఒడిశా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి పేరుతెచ్చి ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికి పట్టం కట్టిన పర్లాకిమిడి మహారాజా శ్రీక్రిష్ణచంద్రగజపతికి ఘనంగా ప్రముఖులు నివాళులర్పించారు. పలు కూడళ్లలోని మహారాజా విగ్రహాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కుమ్మరివీధి వద్ద మహారాజా క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ సమాధి వద్ద జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఏడీఎం ఫల్గునీ మఝి ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మార్కెట్ జంక్షన్ వద్ద మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి భేతాళ సమరవాహినీ యోధుల కత్తి, కర్రసాముల విన్యాసాలను కలెక్టర్, ఏడీఎం, ఇతర అధికారులు తిలకించారు. స్థానిక సరస్వతీ శిశువిద్యామందిర్ నుంచి పట్టణంలోని సత్యసాయి ఇంగ్లిషు మీడియం, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఒడిషా రాష్ట్ర పోరాటపటిమకు చిహ్నామైన పర్లాకిమిడి మహారాజా, ఉత్కళ మాత, మధుసూదన్ దాస్, ఒడియా సంస్కృతిక అద్దం పట్టే బోయితోబోంధన్ వేషాధారణ, కత్తి, కర్రసాము, పాయక్ యుద్ధవీరుల గాధలను తెలియజేస్తూ ర్యాలీని మార్కెట్ వరకూ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా పరిషత్తు కార్యనిర్వాహణ అధికారి, సీడీవో దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక ఈవో లక్ష్మణ ముర్ము, జిల్లా కల్చరల్ అధికారి అర్చనా మంగరాజ్, బినోద్ జెన్నా, భరత్ భూషణ్ మహాంతి, ఫృథ్వీరాజ్ మండళ్ పాల్గొన్నారు.


