మల్కన్గిరి : ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సుజాతా నాయక్ మంగళవారం మల్కన్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల కోసం అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వారి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎంవీ–03 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె తమసా ఆశ్రమ పాఠశాల, మల్కన్గిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్య హక్కు చట్టం సరైన అమలుపై దృష్టి సారించి పిల్లల భద్రతను నిర్ధారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమసా గ్రామ పంచాయతీలో నిర్వహించిన పంచాయతీ స్థాయి బాలల సంక్షేమ, కమిటీ సమావేశంలో పాల్గొన్న సభ్యురాలు మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది బాలల హక్కులపై ఘారమైన ఉల్లంఘన అని తెలిపారు. దోపిడీ లేని బాల్యం ప్రతి పిల్లవాడి జన్మహక్కు అని పేర్కొన్నారు. సమావేశంలో బాల కార్మికత్వం, భిక్షాటనలో పిల్లలను ఉపయోగించడం లేదా మత్తు పదార్థాల వ్యాపారంలో పిల్లలును వినియోగించడం వంటి నేరాలపై కఠన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


