కొరాపుట్: గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణిని సుమారు 3 కి.మీ డోలీపై తరలించిన బాధాకరమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి బరాజోడి గ్రామానికి చెందిన హేడు జానీ భార్య సేను జానీకి పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్తకి సమాచారం ఇచ్చారు. అమె వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్కి సమాచారం ఇచ్చింది. అయితే ఆ గ్రామానికి రోడ్డుమార్గం లేకపోవడంతో వాహనం రాలేకపోయింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మంచంపైనే గర్భిణీని ఉంచి తెంతులకుంటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.


