భువనేశ్వర్: కొత్త విద్యా సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రవేశాలు, అక్షరాభ్యాసం కార్యక్రమం ఖరారు అయింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ నెల రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆరేళ్లు పైబడిన పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుకుంటారు. ఆరేళ్ల లోపు పిల్లలు బాలల విభాగంలో బాల వాటికలో చేరగలరని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద్ గోండ్ తెలిపారు.
ఒంటి పూట బడులు
రాష్ట్రంలో వేసవి క్రమంగా పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేసవి కాలంలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయమై త్వరలో జరిగే శాఖా సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు, వర్గాలకు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.
అప్పారికి ఘనంగా నివాళులు
విజయనగరం అర్బన్: స్థానిక ఏపీ యూటీఎఫ్(ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కార్యాలయంలో యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి వర్ధంతి శనివారం నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు రాము, రమేష్ పట్నాయక్, తిరుపతినాయుడు, ప్రసాద్, రాజారావు, శంకరరావు, సూర్యారావు, శ్రీదేవి, వెంకటరావు, సత్యనారాయణ, నిర్మల తదితరులు హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విద్య బలోపేతానికి ఆయన చేసిన కృషిని వక్తలు కొనియాడారు.
గ్యాస్ కష్టాలు
రాజాం: వంట గ్యాస్ కోసం పట్టణంలోని మూడు హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలకు చెందిన వినియోగ దారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు.ఆన్లైన్లో బుక్ చేసినా గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్దకు వెళ్లి గంటలతరబడి నిరీక్షిస్తున్నారు. రాజాంలోని పాలకొండ రోడ్డులో ఓ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద రాజాం పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన పలువురు వినియోగ దారులు శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. అంతకు ముందు సకాలంలో ఏజెన్సీ కార్యాలయం తెరవకపోవడంతో కార్యాలయం ఎదుట ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు.


