
9 నాగుపాములు, కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎం.వి.8 గ్రామంలో సోమవారం తొమ్మిది నాగుపాములు, ఒక కొండచిలువను జిల్లా స్నేక్ హెల్ప్లైన్ సభ్యుడు శరత్ మాఝి పట్టుకున్నారు. కొద్దిరోజులుగా గ్రామంలో పాములు సంచరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చీకటి పటితే బయట తిరగలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు స్పందించి పాములను పట్టించారు. సీసాల్లో బంధించిన పాములను ఎంవీ 11 గ్రామ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
వంతెన కూలి రాకపోకలకు అంతరాయం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి ఆండ్రాపల్లి–పనాస్పూట్ పంచాయతీల ప్రధాన రహదారిపై ఉన్న వంతెన జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. దీంతో రెండు గిరిజన గ్రామ పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను నాసిరకంగా నిర్మించడంతోనే కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కూలిన వంతెనను నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు
విద్యుత్ విభాగ కార్యాలయం ముట్టడి
జయపురం: గత పది దినాలుగా తమ గ్రామానికి విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నామని జయపురం సమితి బొయిపరిగుడ సమితి బొదాగుడ పంచాయతీ మాలిగుడ ప్రజలు సోమవారం విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. బొయిపరిగుడలో గల విద్యుత్ విభాగ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు తమ గ్రామానికి గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేదని, ఈ విషయం సంబంధిత అధికారులకు ఎన్ని పర్యాయాలు తెలిపినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పోలీసులు వచ్చి సమాధాన పరచడంతో శాంతించారు.
ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం వార్షికోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎక్స్బోర్డ్ పాఠశాలలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం 14వ వార్షికోత్సవం సందర్భంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షుడు ప్రకాష్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో డబ్బీరు కేశవరావు భార్య డబ్బీరు భాగ్యలక్ష్మి, సింగమహంతి రామచంద్ర పట్నాయిక్ కుమారుడు ఎస్.దుర్గా పట్నాయక్ ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు ప్రకాష్ పట్నాయక్, దుర్యోధన్ పాత్రో, నారాయణ్దాస్ తదితరులను సన్మానించారు.

9 నాగుపాములు, కొండచిలువ పట్టివేత