రోడ్డు నిర్మించాలని వినతి
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ ఖర్చబడి పంచాయతీ పరిధి గోవిందపూర్ మామిడితోట జంక్షన్ నుంచి గోంగరి గావ్, బి.రైసింగి వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు మోహనా సమితి చైర్మన్ రాజీవ్ శొబొరో ఆధ్వర్యంలో మోహనాలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోహనా బీడీవో రాజీవ్ దాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 75 ఏళ్లుగా ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
జయపురంలో ఇంటింటా సర్వే
జయపురం: జయపురం సమితి, మున్సిపాలిటీలో 18 ఏళ్లలోపు నిరక్షరాస్యులు, డ్రాపౌట్స్ సర్వేను ఇంటింటా నిర్వహించారు. మొత్తం 15 క్లస్టర్లు ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంగ్రహించిన వివరాలను టేబులైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. టేబులైజేషన్ పూర్తయితే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ సిద్ధమణుగు పంచాయతీ పరిధి చిత్రకార్ లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపురం గ్రామస్తులు వినతిపత్రాన్ని కలెక్టరేట్లో పాలనాధికారికి బుధవారం అందజేశారు. ఆ భూమిలో ఇదివరకు గ్రామానికి సామాజిక కేంద్ర భవనం నిర్మించాలనుకున్నామని తెలిపారు. అయితే కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ కాశీనగర్ తహసీల్దార్కు సైతం మరో వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ను కలిసినవారిలో లక్ష్మీకోరాయి, ఎం.గోవింద తదితరులు ఉన్నారు.
నదిలో మునిగి బాలుడు మృతి
మల్కన్గిరి: జిల్లాలోని పోడియా సమితి ఎంపీవీ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు శబరీ నదిలో మునిగి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంపీవీ గ్రామంలో అర్జున్ మీరాజ్ కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు ఏడేళ్ల నాయన్ మీర్జా సెలవులు కావడంతో తోటి పిల్లలతో కలిసి స్నానానికి గ్రామానికి సమీపంలోని శబరీ నదికి వెళ్లాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి వారిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఇద్దరిలో ఒకరిని మాత్రమే రక్షించగలిగాడు. ఈ విషయం తెలిసిన తండ్రి అర్జున్ కూడా నీటిలో దూకి వెదికారు. అయితే కొంతదూరంలో బాలుడు తేలుతూ కన్పించాడు. వెంటనే బాలుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్లగా అక్కడ వైద్యులు బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు. వెంటనే పోడియా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
రోడ్డు నిర్మించాలని వినతి
రోడ్డు నిర్మించాలని వినతి


