కూటమి పాలనలో నగరాభివృద్ధి శూన్యం ● గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు నిలిపివేశారు
● పేదలకు చెందాల్సిన ఇళ్లను టీడీపీ వారికి కట్టబెడుతున్నారు
● వీఎంసీ స్థలాలను సైతం టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు
● టీడీపీ నేతల అక్రమ లేఅవుట్లను పట్టించుకోని టౌన్ప్లానింగ్
● వైఎస్సార్ సీపీ నేతలు వెలంపల్లి, దేవినేని, మల్లాది, భాగ్యలక్ష్మి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో నగరాభివృద్ధి శూన్యమని, నగరంలోని మూడు డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోలేదని వైఎస్సార్ సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రజా సమస్యలపై వారు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో ఏసీజీ రవీంద్రరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండేళ్ల నగర పాలక సంస్థ పాలన అంతా అస్తవ్యస్తంగా తయారైందని, నగరంలో పేరుకుపోయిన సమస్యలు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు పట్టవా అంటూ మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను టీడీపీ నాయకులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాధరపురం లేబర్కాలనీ గ్రౌండ్లో గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిర్మాణ పనులు మొదలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపేశారని అన్నారు. అమరావతి పేరుతో నిధులను మళ్లించి విజయవాడ నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, అర్హులైన నిరు పేదలను పక్కనపెట్టి 500 మంది టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన ఆ ఇళ్లకు పచ్చ రంగు వేయటం టీడీపీ పబ్లిసిటీకి పరాకాష్ట అన్నారు. తక్షణమే అక్రమ కేటాయింపులను రద్దు చేసి లాటరీ పద్ధతిలో పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 63వ డివి జన్లో వీఎంసీకి చెందిన 10 ప్లాట్లను ఒక్కొక్కటీ రూ.50 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. గిరిపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించి డయేరియా ప్రబలి ప్రజలు ప్రాణాలు వదులుతున్నా పాలకులు, అధికారులకు పట్టకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ స్థలాల్లో అక్రమ కట్టడాలు జరుగుతుంటే టౌన్ప్లానింగ్ అధికారులు ఉత్సవ విగ్రహాల్లా కళ్లప్ప గించి చూస్తున్నారన్నారు. ఇకపై నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి పంపించేయాలంటున్నారని, అంటే నగరాభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదని స్పష్టమవుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల కేటాయింపుల్లో
భారీ అక్రమాలు..
టీడీపీ కార్యకర్తల్లా తయారైన
టౌన్ప్లానింగ్ అధికారులు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టౌన్ప్లానింగ్ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా తయారయ్యారని, ఎంపీ, ఎమ్మెల్యేలతో కుమ్మక్కయి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పార్క్లను అభివృద్ధి చేస్తే ఇప్పుడు అవి మందుబాబుల అడ్డాగా మారిపోయాయన్నారు. వర్షం కురిస్తే తూర్పు నియోజకవర్గంలో నీరు నిలిచిపోతుందని, చనిపోయినవారిని కూడా నీళ్లల్లో పెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని అన్నారు.
ఉత్సవ విగ్రహాల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు