లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ) గుర్తించి, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్నొన్నారు. ఈ సందర్బంగా షేక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ రంగంలో నాలుగు లక్షల మంది వరకూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అయితే సీజన్ లేని సమయంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ రంగానికి రాయితీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, కార్యదర్శిగా సీహెచ్వీ సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీనరసారెడ్డి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధి సుబ్బారావు, విజయవాడ వర్తక సంఘం అధ్యక్షుడు జీఎల్ మల్లికార్జునరావు, కార్యదర్శి టీవీ రమణ, కోశాధికారి సన్నపు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్


