విజయవాడలో ప్రారంభమైన ఎస్సీఐఏపీ సదస్సులో వక్తలు
పటమట (విజయవాడ తూర్పు): పట్టణాల సుస్థిరాభివృద్ధి కోసం స్థానికసంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్ ధ్యాన్చంద్ర చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (ఎస్సీఐఏపీ) అంశంపై విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును సోమవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు.
● వీఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ర మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి రంగాల్లో ఉత్తమ విధానాలను అమలు చేస్తోందన్నారు.
● యునిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నంద్పాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపికా లేలే ఎస్సీఐఏఈ చేస్తున్న సేవలను తెలిపారు.
● వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డీకార్బనైజింగ్ సిటీస్ అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నిపుణులు పట్టణ ఘనవ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, తక్కువ కార్బన్ ఆధారిత అభివృద్ధి విధానాలపై చర్చించారు.
● ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్ డెబోలినా కుండు, ఎన్ఐయూఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాధిపతి పరమితా దత్తా డే, ఐసీఎల్ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమాని కుమార్, గుంటూరు మునిసిపల్ కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


