వత్సవాయి: ఆయా పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి డీఎంఎఫ్ విజయకుమారి సూచించారు. ఆదివారం మండల కేంద్రం వత్సవాయిలోని విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నమ్మకమైన షాపులో నాణ్యమైన విత్తనాలను తీసుకుని సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన తరువాత తప్పకుండా రశీదులు తీసుకుని వాటి మీద బ్యాచ్ నంబర్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. తీసుకున్న రశీదులను పంట పూర్తమ్యే వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని తెలిపారు. ఒకవేళ విత్తనాలలో లోపం ఉన్నట్లయితే సదరు రశీదుతో షాపుల మీద కేసు పెట్టుకునే అవకాశం ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో జి. సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ), గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్టెచ్చర్ బేరర్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాలను జూన్ 1 నుంచి 3 వరకూ స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. మెరిట్ జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ ntr.ap.gov.inలో పరిశీలించవచ్చని ఆయన తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అర కిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ.1.36లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
ఉత్సాహంగా క్రికెట్ టోర్నీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా.. ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. బహుమతి ప్రదానోత్సవానికి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరై గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిచారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్ పాల్గొన్నారు.


