గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాదక ద్రవ్యాల మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయం సమావేశం శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వివరించారు. జిల్లాలోని గుర్తించిన సుమారు 150 హాట్ స్పాట్ల్లో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. 1972 టోల్ఫ్రీ నంబరు గురించి ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చెల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఈవో చంద్రకళ. ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు


