జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: జౌళి పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ఎండీ వల్లభనేని సుధాకర్‌ చౌదరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు.

ఏపీలో విస్తృత అవకాశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో జౌళి పరిశ్రమ రంగంలో ఎదిగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్లు మేర ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ ప్రకటించిందన్నారు. ఈ ప్రొత్సాహాకాల్లో ఏపీ అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్‌ స్పిన్‌టెక్స్‌ పరిశ్రమ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అక్కడ ఉన్న పుంగనూరు ఆవులు, దూడలను పరిశీలించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ రేఖారాణి, కలెక్టర్‌ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి శివకుమార్‌, డైరెక్టర్‌ గిరీష, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి నీరబ్‌కుమార్‌, కేంద్ర జౌళి కార్పోరేషన్‌ గుంటూరు డివిజన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ ధనశేఖరన్‌, చేనేత, జౌళి శాఖ ఏడీలు పాల్గొన్నారు.

విద్యుత్‌ తీగలే.. యమపాశాలై..

పమిడిముక్కల: విద్యుత్‌ షాక్‌కు గురై ఇంటర్‌ విద్యార్థిని ముళ్లపూడి అంకిత(17) మృతి చెందిన ఘటన శుక్రవారం లంకపల్లిలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన అంకిత స్నానం చేసేందుకు లంకపల్లి మెయిన్‌ పాఠశాల వద్ద పంపు వద్దకు నీటి కోసం వెళ్లింది. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంపుపై చెట్టు కొమ్మలు, విద్యుత్‌ తీగలు తెగి పడి ఉన్నాయి. ఇది గమనించని అంకిత నీరు పట్టేందుకు ప్రయత్నించగా.. తెగిపడిన వైర్లలో విద్యుత్‌ ప్రవహించడంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కర్రలతో విద్యుత్‌ వైర్లను పక్కకు జరిపి చూడగా అప్పటికే అంకిత మృతి చెందింది. దీంతో అంకిత తల్లిదండ్రులు ఇశ్రాయేలు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూలీపనులు చేసుకొంటూ కుమార్తెను చదివించుకొంటున్నామని ఆవేదన చెందారు. అంకిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఎన్‌ఐ బి.శ్రీను, విద్యుత్‌ ఏడీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.

పెనమలూరులో మరో యువకుడు మృతి

పెనమలూరు: చెత్త సేకరించి అమ్ముకునే యువకుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పటమట జేడీనగర్‌కు చెందిన ఏసురాణి, కొండయ్యలకు ముగ్గురు పిల్లలు. వారి కుమారుడు చల్లా శ్రీను(17)తో కలిసి చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఏసురాణి, కొండయ్య చెత్త సేకరణ కొసం రామవరప్పాడుకు వెళ్లగా శ్రీను కానూరు కొత్త ఆటోనగర్‌కు వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12గంటలకు చెత్త కొట్టు యజమాని ఏసురాణికి ఫోన్‌ చేసి కొత్త ఆటోనగర్‌ రెండో లైన్‌లో కరెంట్‌ ఆఫీస్‌ పక్కన శ్రీను చనిపోయి ఉన్నాడని సమాచారం తెలపటంతో ఘటనా స్థలం వద్దకు ఏసురాణి, భర్త కొండయ్య వెళ్లారు. డ్రెయినేజీలో విద్యుత్‌ తీగలు పడి ఉండగా ప్రమాదవశాత్తూ శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఏసురాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement