విజయవాడరూరల్: జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్లగణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్)కార్యక్రమం అత్యంత పారదర్శకంగా బాధ్యతాయుతంగా జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటాను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ముగింపు దశలో ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి టాటా స్టీల్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారం అందించడం మంచి పరిణామమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ చెప్పారు. నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో శాప్ లీగ్స్కు సంబంధించిన టాటా స్టీల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.భరణీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ ఫుట్బాల్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు టాటా స్టీల్ లిమిటెడ్తో శాప్ భాగస్వామ్యం కుదుర్చుకుందన్నారు. టాటా స్టీల్ లిమిటెడ్ స్పోర్ట్స్ చీఫ్ ముకుల్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలకు పదును పెట్టేందుకు తమ సంస్థ శాప్తో భాగస్వామ్యం అయ్యిందన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు హామీలు గుప్పించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేత్తడం లేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ విమర్శించారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభ గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆర్. కనకారావు, కె. రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం జెండాను రామకృష్ణ ఎగురవేశారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.రమణ, జీఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల పాలిట శాపంలా మారిన జీవో నంబర్ 20ను రద్దు చేయాలన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులుగా టి. శ్రీను, ఆర్. కనకారావు, గౌరవాధ్యక్షులుగా ఎం. రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా భాస్కర్, సహాయ కార్యదర్శిగా ఎన్. శ్రీను, కోశాధికారిగా కె. నాని ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.


