మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పేస్ టెక్నాలజీపై యువత ఆసక్తి పెంచుకుని పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంఽధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ రెడ్ బెలూన్ పేరుతో రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను బుధవారం ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ స్పేస్ టెక్నాలజీ ద్వారా సేకరించిన సమచారం రైతులు, ప్రజలు, వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సూపర్ ప్రెజర్ బెలూన్ భూమి నుంచి 25 కిలో మీటర్లపైకి వెళుతుందని తెలిపారు. ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మూలాలను తెలుసుకోవడానికి సూపర్ ప్రజర్ బెలూన్లో అమర్చిన సాంకేతిక వ్యవస్థ దోహదపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చౌకగా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టవిటీని ఈ బెలూన్ ద్వారా అందించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.


