ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని మహాదేవపురానికి చెందిన తుంపాటి లక్ష్మీవెంకటపతి కుటుంబసభ్యులతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1.20 లక్షల విరాళాన్ని అందచేశారు. అదేవిధంగా హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు రూ. 3 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందచేశారు. అన్నదానానికి పొట్లూరి వనజాక్షి పేరిట రూ. లక్ష, పొట్లూరి పూర్ణచంద్రరావు పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందించగా.. కాట్రగడ్డ సునీల్కుమార్, వెంకట్ల పేరిట దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం భక్తులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


