ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు.
భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల పనితీరుతోపాటు అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదాము వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమేరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల తనిఖీలో కలెక్టర్ లక్ష్మీశతోపాటు డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.


