ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా నిర్వహణ ఎన్టీఆర్ జిల్లాలో 2600, ఉమ్మడి కృష్ణాలో 4500 షాపుల బంద్ ఔషధ వ్యాపారులు నగరంలో ర్యాలీ నగరంలో సాయంత్రానికి తెరుచుకున్న షాపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆన్లైన్లో మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ దేశ వ్యాప్తంగా 24 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ఆ మేరకు ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లోని ఔషధ వ్యాపారులు బుధవారం బంద్ పాటించారు. దీంతో మందుల షాపులు తెరుచుకోలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
మూతపడిన షాపులు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో హోల్సేల్ రిటైల్ కమిటీ 4500 వరకూ మందులు షాపులు ఉన్నాయి. వాటిలో 2600 వరకూ ఎన్టీఆర్జిల్లాలోనే ఉన్నాయి. అవన్నీ బుధవారం మూతపడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక్కషాపు కూడా తెరుచుకోలేదు. అనంతరం కొన్ని షాపులను తెరిచారు.
నగరంలో భారీ ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా సూర్యారావుపేట నక్కలరోడ్డులోని సిద్ధార్థ మెడికల్స్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్, ఏఎస్ రామారావు రోడ్డు, డోర్నకల్ రోడ్డులోనుంచి ఏలూరు రోడ్డులో కలిసి తిరిగి నక్కల రోడ్డు నుంచి ప్రారంభమైన చోటుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డీవీఆర్ సాయికుమార్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలు జరపడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే నన్నారు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వడమే కాకుండా, ప్రిస్కిప్షన్ కూడా ఆన్లైన్లోనే రూపొందించడం గమనార్హం అని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సాధుప్రసాద్, జి శ్రీహరిరావులతో పాటు పెద్ద సంఖ్యలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పాల్గొన్నారు.


