ముక్త్యాల(జగ్గయ్యపేట): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గ్రామస్తులు గుర్తించారు. వివరాలలోకి వెళితే మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన దార్ల కృష్ణ (46) తాపీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా పనికి వెళ్లి రాత్రికి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు.


