భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో రాజీ పడవద్దని దేవదాయ శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలోని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్జేసీ, డీసీ కేడర్కు చెందిన 22 ప్రధాన ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్లైన్ సేవలను పెంచాలని సూచించారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈవోలను ఆదేశించారు.
రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్
ఏర్పాటు చేయాలి..
భూగర్భ జలాల పెంపుదలకు అన్ని ఆలయాల భవనాలపై ‘రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్’ (వర్షపు నీటి సంరక్షణ) పద్ధతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కమిషనర్ రామచంద్ర మోహన్ పేర్కొన్నారు. ఆలయాల్లో సూయజ్, సల్లేజ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, తద్వారా నీటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. రానున్న నెల రోజుల్లోగా అన్ని దేవాలయాల్లో పైప్డ్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆలయాల్లో సంప్రదాయేతర విద్యుత్ వనరులను ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్ర దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో
కార్యదర్శి హరిజవహర్లాల్


