కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏవీఎంఐ)గా పనిచేస్తున్న పిల్లుట్ల లోకనాథప్రసాద్ ఇల్లు, కార్యాలయాల్లో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలుచేసి భారీగా ఆస్తి పత్రాలు, బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన లోకనాథప్రసాద్ బందరులో ఏవీఎంఐగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు మంగళవారం విజయవాడలోని లోకనాథప్రసాద్ ఇల్లు, అతడి సోదరుడు ఇంటితో పాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో లోకనాథప్రసాద్ పేరిట ఉన్న సుమారు 2.75 ఎకరాల వ్యవసాయ భూమి దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో మూడు భవనాల దస్తావేజులు, 450.2 గ్రాముల బంగారు, 1,496 గ్రాముల వెండి వస్తువులు, రెండు కార్లు, మూడుబైక్లు, రూ.18.80 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు, రూ.2.54 లక్షల నగదు, ఒక బ్యాంకు లాకర్ తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 వేలను సీజ్ చేశారు. తాళంచెవి దొరికిన బ్యాంకు లాకర్ను సోదా చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తులు కలిగిన లోకనాథప్రసాద్పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.


