సమ్మోహనం..
విజయవాడ కల్చరల్: డాక్టర్ నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్కు చెందిన స్వరనర్తన సంస్థలు, ఏపీ సృజనాత్మక సమితి సహకారంతో పటమట స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో ఆదివారం పంచశత ఆంధ్రనాట్య సంగమం త్రివేణీ సంగమంలా సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చిన నాట్యాచార్యులు ఆంధ్రనాట్య సంప్రదాయంలో పలు అంశాలను 500 మంది ఏకకాలంలో నృత్యాలను అభినయించారు. పంచశత నాట్య సమ్మేళన రూపకర్త నాట్యాచార్యుడు పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు నిర్వహించారు.
ఆంధ్ర నాట్యానికి పూర్వవైభవం తీసుకురావాలి
ఆంధ్ర నాట్యానికి పూర్వవైభవం తీసుకురావాలని నటరాజ రామ కృష్ణ ప్రత్యక్ష శిష్యుడు కళాకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ మరుగున పడిన ఆంధ్ర నాట్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి జీవితాంతం కృషి చేశారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూచిపూడి నాట్యానికి ప్రాధాన్యమిచ్చినట్లే ఆంధ్ర నాట్యానికి కూడా ఇవ్వాలని సూచించారు. ఆంధ్ర నాట్యాచార్యులు పి.ఉమాహేశ్వర పాత్రుడు, దెందులూరి పద్మామోహన్, కర్నాటి నవతలు ఆంధ్రనాట్య విశిష్టతను వివరించారు. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ శిష్యప్రశిష్యులు కావడం విశేషం.


