ఎ.కొండూరు: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి పథకం ప్రకారం దారికాచి మరో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేసేందుకు యత్నించిన ఘటన మండ లంలోని పెద్ద తండా సమీపాన మైలవరం బ్రాంచి నాగార్జున సాగర్ కాలువ కట్టపై గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య, అదే గ్రామానికి చెందిన లావూరి సీతారాం మధ్య పాత కక్షలు ఉన్నాయి. జమలయ్య గురువారం పెద్ద తండా సమీపంలోని మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే అతని రాకకోసం ఎన్ఎస్పీ కాలువ కట్టపై లావూరి సీతారాం మాటు వేసి ఉన్నాడు. జమలయ్య బైక్పై తన సమీపంలోకి రాగానే సీతారాం గొడ్డలితో అతడిపై దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జమలయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని చీమలపాడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ పరిశీలించి, గొడ్డలితో దాడిచేయడం వల్ల జమలయ్య తలకు తీవ్రగాయమైందని, వెంటనే విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ఎ.కొండూరు ఎస్ఐ జి.మహాలక్ష్మణుడును వివరణ కోరగా.. గొడ్డలితో దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఘటనా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారని, బాధితుడి వాంగ్మూలం తీసుకోవడానికి సిబ్బందిని పంపించానని పేర్కొన్నారు.


