ప్రత్యేక నమాజ్లకు ఏర్పాట్లు..
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాసదీక్షలు పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. గురువారం సౌదీ ఆరేబియాలో నెలవంక కనిపించడంతో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం రంజాన్ను జరుపుకొన్నారు. మన దేశంలో శనివారం పండుగను జరుపుకోవాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. దాంతో అన్నిచోట్లా ఈద్ సందడి కనిపించింది. ముస్లింలు ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు.
ఉదయం ఏడు నుంచి ప్రార్థనలు..
ఒక్కొక్క మసీదు, ఈద్గాలలో ఆయా నిర్వాహకుల నిర్ణయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం ఏడు గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అలాగే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎనిమిది గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా పదకొండు గంటల వరకూ వివిధ సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. నమాజ్లకు ముందు కొద్దిసేపుమత పెద్దల ప్రసంగాలు ఉంటాయి.
కళకళలాడుతున్న మసీదులు..
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదు ప్రాంగణాలు విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ఆదివారం ఉపవాసాలకు చివరి రోజు కావటంతో ముస్లింలు రాత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాతబస్తీ, వించిపేట, చిట్టినగర్, భవానీపురం, అరండల్పేట, లబ్బీపేట తదితర ప్రాంతాల్లోని మసీదులన్నీ పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో కొత్త శోభను సంతరించుకున్నాయి.
మసీదు కమిటీల ఆధ్వర్యంలో శనివారం పండుగ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మసీదుల వద్ద కంటే ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించేందుకే ఎక్కువ మంది భక్తులు రానున్నారు. విజయవాడలో ప్రధానంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, చిట్టినగర్ ఈద్గాతో పాటుగా అన్ని మసీదుల్లోనూ పండుగ ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనికోసం నగర పాలకసంస్థ ఆయా మైదానాలు, ఈద్గాల్లో ఏర్పాట్లు చేసింది


