మచిలీపట్నంటౌన్: బందరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి తదితర పన్నులపై ఉన్న వడ్డీ 50శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్, మచిలీ పట్నం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి డీకే బాలాజీ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆస్తి, ఖాళీస్థలాలు, తాగునీటి పన్నులు చెల్లించే వారికి వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లిస్తే నగరపాలక సంస్థ ఆర్థికంగా బలోపేతమవుతుందని తద్వారా పౌర సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సదుపాయాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


