గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): దేశంలోని రైల్వే వ్యాగన్ వర్క్షాపుల్లో ఒకటైన గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకకు సిద్ధమైంది. వర్క్షాపులో బుధవారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపేందుకు ముస్తాబు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చీఫ్ వర్క్షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్ మంగళవారం వర్క్షాపులో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
2,400 మంది ఉద్యోగులకు ఆసరా
రైల్వే వ్యాగన్ వర్క్షాపు ప్రతి ఏడాది భారీగా ఆదాయం గడిస్తోంది. సంస్థలో 2 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 400మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి వేతనాలు, ఇతర ఖర్చులు మొత్తం ఏడాదికి రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. కార్మికులు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలతో పాటు ప్రతి ఉద్యోగి, కార్మికుడు తమకు తోచిన సహాయం అందించడం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కాలుష్య నివారణకు సుమారు 10 వేల మొక్కలు నాటారు. నూతన పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా పనిభారం తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
రైల్వే వ్యాగన్ వర్క్షాపు గతంలో కంటే ఇప్పుడు పురోభివృద్ధి సాధించింది. ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 8,200 రైలు వ్యాగన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. రూ.200 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. పూర్తిగా వినియోగించుకుంటే ఏడాదికి 10వేల వ్యాగన్లు మరమ్మతులు జరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వర్క్షాపు రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. వచ్చే వేసవి నాటికి రూ.కోటి వ్యయంతో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తాం.
–ఎస్.శ్రీనివాస్, చీఫ్ వర్క్షాపు మేనేజర్
నేడు గుంటుపల్లి వ్యాగన్
వర్క్షాపు గోల్డెన్ జూబ్లీ


