గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను సేంద్రియ వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించేలా బ్యాంకులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించి 555 బ్రాంచ్ల ద్వారా అందుతున్న సేవలు, వివిధ బ్యాంకింగ్ సూచికల్లో ప్రగతి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన తదితరాలపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.83,500 కోట్లు లక్ష్యం కాగా డిసెంబర్ 31 నాటికి 88,269 కోట్లు పంపిణీతో 106 శాతం మేర లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రకృతి సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని, భవిష్యత్ అంతా ఆర్గానిక్ ఉత్పత్తులదేనని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగు తోందన్నారు. మరో రెండేళ్లలో లక్ష ఎకరాలకు పైగా ఈ విధానం అమలు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకు రుణ మద్దతు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు భాగస్వాములుగా వ్యవహరించి అర్హులైన వారికి సమయానికి రుణాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ యూబీఐ రీజినల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ మేనేజర్ రాజేష్కుమార్ కుంద్, నాబార్డు డీడీఎం పృథ్వి, ఎల్డీఎం ప్రియాంక, అమరేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


