హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనురెప్పపాటులో లారీ చక్రాల కింద పడి చిన్నారి తల భాగం నుజ్జునుజ్జు కావటం చూపరులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్పీహెచ్ కాలనీకి చెందిన గుణపు సునీల్ తన ముద్దుల మేనకోడలు పాగోలు రియాల్షి (3)ని బైక్పై ఎక్కించుకుని సరదాగా తిప్పేందుకు బయటకు తీసుకువచ్చాడు. గ్రామ ప్రధాన కూడలిలోని తిరుపతమ్మ తల్లి గుడి సెంటర్ నుంచి జాతీయ రహదారి వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి వీరి బైక్ను ఢీకొట్టింది. బైక్ లారీ కింద ఇరుక్కుపోగా బండిపై కూర్చున్న మూడేళ్ల చిన్నారి పాగోలు రియాల్షి పైకి ముందు టైర్లు ఎక్కటంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. చిన్నారి తలపైకి లారీ చక్రాలు ఎక్కటంతో నుజ్జునుజ్జు అయి, మెదడు, ఇతర భాగాలు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంతో చిన్నారి కుటుంబంతో పాటుగా ఆర్పీహెచ్ కాలనీలో రోదనలు మిన్నంటాయి. నిర్లక్ష్యంగా లారీ నడిపి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు హరించిన లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. బైక్ నడుపుతున్న మృతురాలి మేనమామ సునీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హనుమాన్జంక్షన్ సీఐ ఎల్.రమే ష్, ఎస్ఐ వి.సురేష్, వీరవల్లి ఎస్ఐ సత్యం ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. ప్రమాద ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి దుర్మరణం
Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM
● బైక్పై సరదాగా తిప్పేందుకు తీసుకొచ్చిన మేనమామ
● వెనుక నుంచి బైక్ను ఢీకొట్టిన లారీ
● టైర్ కింద పడి అక్కడికక్కడే చిన్నారి మృతి
● వీరవల్లిలో అలుముకున్న విషాద ఛాయలు
Advertisement
Advertisement


