రెవెన్యూ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి
పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని.. ప్రధానంగా రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక జరిగింది. డీఆర్వో లక్ష్మీనరసింహంతో కలిసి జేసీ అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ సేవలు పార దర్శకంగా అందించాలన్నారు. వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఫ్లో చార్ట్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలా డివిజన్, మండల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతికి తావులేకుండా, పూర్తి పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, అదే సమయంలో అర్జీదారుడికి సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
పీజీఆర్ఎస్కు 160 అర్జీలు
పీజీఆర్ఎస్కు మొత్తం 160 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 50 అర్జీలు వచ్చాయి. పోలీస్ శాఖకు 23, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 13, పంచాయతీరాజ్కు 12, పురపాలక శాఖకు 11 అర్జీలు రాగా విద్య, డీఆర్డీఏ విభాగాలకు తొమ్మిది చొప్పున అర్జీలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు 6, సర్వేకు 4, విద్యుత్ శాఖకు 4, కళాశాల విద్యకు 3, గృహ నిర్మాణం 2, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్కు 2 అర్జీలు రాగా వివిధ శాఖలకు 12 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, గ్రామ వార్డు సచివాలయాల సమన్వయ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తున్న జేసీ ఇలక్కియ, ఇతర అధికారులు


