యార్డులు నిండిపోయి చేలల్లో ఆరబోస్తున్న రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్న వైనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 28,447హెక్టార్లలో సాగు 2,41,800 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం
కొనుగోళ్లు ప్రారంభించని రాష్ట్ర ప్రభుత్వం
రూ.140
కోట్ల వరకు నష్టం..
ఎన్టీఆర్ జిల్లాలో 23,547 హెక్టార్లలో ఈ ఏడాది రబీ మొక్కజొన్నను రైతులు సాగు చేస్తుండగా 2,00,150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణాజిల్లా 4,900హెక్టార్లలో రబీలో మొక్కజొన్న సాగువుతుండగా 41,650టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర క్వింటాకి రూ.2400కి కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో దళారులకు క్వింటా మొక్కజొన్నలు రూ.1800కి విక్రయించి క్వింటాకి రూ.600చొప్పున రైతులు నష్టపోతున్నారు.
ఈ విధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,41,800టన్నుల మొక్కజొన్నలకు గానూ రూ.145కోట్ల మేర రైతులు నష్టపోయే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గత పదిహేను రోజులుగా ముందస్తుగా వచ్చిన మొక్కజొన్నలైతే క్వింటా రూ.1600కి కూడా దళారులకు విక్రయించి రైతులు నష్టపోయారు.
జి.కొండూరు: రైతుకు భరోసా లేదు.. పంటకు ఇన్సూరెన్స్ లేదు.. వైపరీత్యాల్లో నష్ట పరిహారం లేదు.. ఆకాశాన్నంటే ఎరువుల ధరలు.. ఇన్ని అవాంతరాలు దాటుకొని పంట పండిస్తే కొనే నాథుడే ఉండడు.. గిట్టుబాటు ధర అందదు.. దళారులు రాజ్యమేలుతున్నా పట్టించుకునే అధికారి కనిపించడు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంలో దేశానికి వెన్నెముకలాంటి రైతన్న వెన్ను విరిగిపోతోంది. మొక్కజొన్నల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మద్దతు ధరకు మొక్కజొన్నల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో దళారులకు విక్రయించలేక మార్కెట్ యార్డులలో ఆరబోసి రైతులు లబోదిబోమంటున్నారు. యార్డులు నిండిపోయి ఆరబోసేందుకు కూడా తావులేక చేలల్లో, రహదారులపై ఆరబోస్తున్నారు. మైలవరం మార్కెట్ యార్డు మొక్కజొన్నలతో నిండిపోయింది. వాతావరణంలో మార్పులు వస్తున్న క్రమంలో ప్రభుత్వం వాన పట్టాలను సైతం సిద్ధం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు అవసరమైన తాగునీరు వంటి కనీస మౌలిక వసతులను కూడా యార్డులో కల్పించకపోవడంతో నరకయాతన పడుతున్నారు.


