ఇంద్రకీలాద్రిపై
వైభవంగా
ఆదిదంపతుల
పరిణయ వేడుక
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని రాయబార మండపంలో గంగా పార్వతి(దుర్గ), మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తుల వద్ద ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. కవి పండితులు, ఆలయ అర్చకులు అమ్మవార్ల, స్వామి వార్ల గుణగణాలు, అలంకారాలు, అందచందాల గురించి వర్ణించి కల్యాణానికి ఇరు వర్గాలను అంగీకరింపచేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. కల్యాణోత్సవాన్ని స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ప్రత్యేక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆదిదంపతుల కల్యా ణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఉభయదాతలు, భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, చైర్మన్ రాధాకృష్ణ దంపతులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.


