
పోలీస్ గ్రీవెన్స్లో 86 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 86 అర్జీలు అందగా వాటిలో భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 40, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించినవి 2, వివిధ మోసాలకు సంబంధించినవి 5, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 9, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 20 ఫిర్యాదులు అందాయి.