
సార్వత్రిక విద్య మిథ్య!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యలవాడగా పేరుగాంచిన జిల్లాలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఫలితాలు అందరినీ షాక్కు గురిచేశాయి. అధికారుల తీరు, కోఆర్డినేటర్ల నిర్లక్ష్యంతో జిల్లా ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా అభ్యర్థుల భవితతో ఆటలాడుతున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి మాసంలో సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలతో పాటుగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్లో అభ్యసించే పది, ఇంటర్ అభ్యర్థులకు సైతం పరీక్షలను ఏకకాలంలో నిర్వహించింది. సాధారణ పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాటుగా ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫలితాల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ 24, 25 స్థానాల్లో ఎన్టీఆర్ జిల్లా ఉండటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
అందని పాఠ్య పుస్తకాలు..
సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి ఏటా ఆ సంస్థ నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. ఫీజు చెల్లించిన వారికి పుస్తకాలను సకాలంలో పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందలేదని ఆయా కోర్సులకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి కోఆర్డినేటర్లు సైతం పలు కారణాలను చెబుతూ తమను తప్పుదోవ పట్టించారని పలువురు ఫీజు చెల్లించిన అభ్యర్థులు వాపోతున్నారు. సకాలంలో పుస్తకాలు అందకపోవటం వల్లే చాలా మంది అరకొర చదువులతో పరీక్షలకు హాజరయ్యారని, అందుకే ఈ తరహా ఫలితాలు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ ఏడాది పూర్తిగా పర్యవేక్షణను వదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో అడ్మిషన్ల సంఖ్య భారీగానే పడిపోయిందని, అలాగే ఫలితాలు సైతం దిగజారిపోయాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాపీఠం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను సైతం నిర్వహించలేదని దానిని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించలేదని కోఆర్డినేటర్లు చెబుతున్నారు.
వేలాది
రూపాయలు దండుకున్నారు!
తమ నుంచి వేలాది రూపాయలు దండుకున్నారని, తీరా పరీక్ష ఫలితాల్లో తమకు అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థులు కోఆర్డినేటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఓపెన్ స్కూల్ కోర్సులను నిర్వహించే సంస్థలు విద్యార్థులకు పలు మాయ మాటలు చెప్పి వారి నుంచి వేలాది రూపాయాలు దండుకున్నారని ప్రచారం జరిగింది. ‘మిమ్మల్ని పాస్ చేయిస్తాం, మీరు చూసి రాసుకోవచ్చు’ అంటూ పలు రకాలుగా వారిని మభ్యపెట్టి భారీ వసూళ్లకు పాల్పడిన విషయాలపై పెద్ద స్థాయిలో విమర్శలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. తీరా పరీక్షలు సాధారణ షెడ్యూల్లో పెట్టడం, గట్టిగా నిఘా ఉంచటం, ఎక్కడా మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చేయటంతో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి.
ఫలితం.. సు‘దూరం’
ఇదీ ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి:
కానరాని తరగతుల జాడ..
దూరవిద్యలో దారుణ ఫలితాలు
ఓపెన్ స్కూల్ ఫలితాల్లో
భారీగా పడిపోయిన ఉత్తీర్ణత
‘పది’లో 25వ స్థానం, ఇంటర్లో
24వ స్థానానికి పరిమితమైన జిల్లా
సకాలంలో అందని
పాఠ్య పుస్తకాలు, జరగని తరగతులు
ఓపెన్ స్కూల్ అధికారుల
తీరుపై సర్వత్రా విమర్శలు
ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆయా స్టడీ సెంటర్ల ద్వారా కోఆర్డినేటర్లు తరగతులను నిర్వహించాల్సి ఉన్నా.. అలా జరగలేదు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా అధికారులు ఎక్కడా సరైన పర్యవేక్షణ కానీ పరిశీలన కానీ చేసిన దాఖలాలు లేవని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అందువల్లే కోఆర్డినేటర్లు తరగతులు నిర్వహించకుండానే తమ నుంచి వేలాది రూపాయలు దండుకొని రోడ్డుపైన వదిలేశారంటూ వాపోతున్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పదో తరగతికి 4.34 శాతం, ఇంటర్మీడియెట్లో 20.61 శాతం ఫలితాలు వచ్చాయి.
‘పది’లో రాష్ట్రంలోనే 25వ స్థానంలో నిలువగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది.
పదో తరగతి పరీక్షలకు 1,499 మంది హజరయ్యారు. అందులో వారిలో 785 మంది బాలురు, 714 బాలికలు ఉన్నారు. అందులో కేవలం 65 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 26 మంది బాలురు, 39 మంది బాలికలు ఉన్నారు.
ఇంటర్మీడియెట్ కోర్సుకు సంబంధించి 2,751 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 1715 మంది బాలురు, 1036 మంది బాలికలు ఉన్నారు. అందులో 567 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 301 మంది బాలురు, 266 మంది బాలికలు ఉన్నారు.