
అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, జవాబుదారీతనంతో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఎండలను సైతం లెక్కచేయక సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అర్జీల వివరాలు ఇవి..
రెవెన్యూ శాఖకు సంబంధించి 63 అర్జీలు రాగా.. పోలీస్ శాఖకు 26, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 14, సర్వే 8, విద్య 7, ఉపాధి కల్పన 6, పంచాయతీరాజ్ 4, వైద్య 4, విద్యుత్ 3, జలవనరులు 3, ఆర్డబ్ల్యూఎస్ 3, బీసీ వెల్ఫేర్ 3, పౌరసరఫరాలు 3, దేవదాయ 2, మార్కెటింగ్ 2, రిజిస్ట్రేషన్ 2, హౌసింగ్, స్కిల్ డెవలప్మెంట్, విభిన్న ప్రతిభావంతులు, ఎకై ్సజ్, మెప్మా, వ్యవసాయం, కోఆపరేటివ్, కార్మిక శాఖలకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 162 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్లకు 2018 నుంచి రావాల్సిన డీఆర్ ఏరియర్స్, 11వ పీఆర్సీ ఏరియర్స్ తక్షణమే విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మీద అన్ని ఆస్పత్రుల్లో అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలని, 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని కోరుతూ పలువురు పెన్షనర్లు అర్జీ సమర్పించారు.
● బీసెంట్రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకునే వారిని ఇటీవల కొంత కాలం నుంచి అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు. దీంతో హాకర్స్ అండ్ తోపుడు బండ్ల యూనియన్ ప్రతినిధులు, సీఐటీయూ నాయకుడు దోనేపూడి కాశీనాథ్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించారు. తాము 50 ఏళ్లుగా బీసెంట్ రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. కొందరికి కార్పొరేషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిందని.. దీంతో తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరణ