
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.
సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు.